IPL QUALIFIER 2: ముంబైని ఓడించాలంటే.. గుజరాత్ వారిద్దర్నీ ఆడించాలి: ఆకాశ్ చోప్రా

ఐపీఎల్ 2023 క్వాలిఫైయర్-2 మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, ముంబై జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్లో తలపడనుంది. దీంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో గెలవడం కోసం ఇరు జట్లు అన్ని విధాలుగా సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల గెలుపు అవకాశాలను మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విశ్లేషించారు.

ముంబై ఇండియన్స్‌ను ఓడించడం కష్టమన్న చోప్రా.. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్‌ను కూడా తేలిగ్గా తీసుకోవడానికి లేదన్నారు. హార్దిక్ పాండ్య నాయకత్వంలోని టైటాన్స్ ఈ సీజన్లో ఎంతో నిలకడగా రాణించిందన్నారు. క్వాలిఫైయర్-1లో చెన్నై చేతిలో ఓటమి తర్వాత మరోసారి ఫైనల్ చేరే అవకాశం గుజరాత్ ముందు ఉండటంతో ఆ జట్టు శక్తిమేరా ఆడే అవకాశం ఉందన్నారు.

మరోవైపు ముంబై జట్టుకు ప్లేఆఫ్స్‌కు తిరుగులేని రికార్డు ఉందని ఆకాశ్ చోప్రా గుర్తు చేశారు. రెండింట్లోనూ మెరుగ్గా ఆడిన జట్టు విజయం సాధిస్తుందన్నారు.

‘ముంబైని ఓడించడం తేలిక కాదు. గుజరాత్ కూడా మంచి జట్టే. టైటాన్స్‌ను తేలిగ్గా తీసుకోవద్దు. ఒకసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్నాక.. వాళ్లు టోర్నీ ఆసాంతం అదే స్థానంలో ఉన్నారు. నంబర్ వన్ అయ్యాక మళ్లీ కిందకు పడిపోలేదు. ఎంతో తేలిగ్గా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించారు’ అని ఆకాశ్ చోప్రా గుర్తు చేశారు.

‘చివరి లీగ్ మ్యాచ్‌లో వారిపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఇతర జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలు వారి చేతుల్లో ఉన్నాయి. క్వాలిఫైయర్-2 విషయానికి వస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. అంతకు మించి ఏం చెప్పలేను. బాగా ఆడిన జట్టు గెలుపొందుతుంది. మనం మంచి మ్యాచ్ చూడొచ్చు’ అని చోప్రా అభిప్రాయపడ్డారు.

‘ఈ సీజన్లో గుజరాత్ పేసర్ మహ్మద్ షమీ అద్భుతంగా ఆడుతున్నాడు. 15 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు తీశాడు. పర్పుల్ క్యాప్ రేసులో అతడే ముందున్నాడు. క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు, షమీ మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతుంద’ని ఆకాశ్ చోప్రా తెలిపారు. ఇరు జట్లు చివరిసారి తలపడినప్పుడు షమీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బ్యాటర్లు బంతిని టచ్ చేయడానికే భయపడ్డారన్న చోప్రా.. కానీ షమీకి వికెట్ దక్కలేదన్నారు.

ఈ మ్యాచ్‌లో బలమైన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విభాగాన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే.. గుజరాత్ జట్టులో రెండు మార్పులు చేయాలని ఆకాశ్ చోప్రా సూచించారు. మూడు మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఆకట్టుకోలేకపోయిన దసున్ షనక స్థానంలో సాయి సుదర్శన్‌ను ఆడించాలన్నారు. అప్పుడు ఓవర్సీస్ స్లాట్ ఒకటి ఓపెన్ అవుతుందని.. దీంతో నాల్కండే లేదా యష్ దయాల్ స్థానంలో జోషువా లిటిల్‌ను ఆడించాలన్నరు. హార్దిక్ కచ్చితంగా బౌలింగ్ చేయాలని లేదంటే జట్టులో ఐదుగురు బౌలర్లే ఉంటారన్నారు. ఐర్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన జోషువా లిటిల్.. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్ ముగియడంతో తిరిగి గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరాడు.

2023-05-26T10:16:09Z dg43tfdfdgfd