వరల్డ్ విమెన్స్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఇండియా బాక్సర్లకు మిశ్రమ డ్రా
న్యూఢిల్లీ: స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సొంతగడ్డపై వరల్డ్ విమెన్స్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఇండియా చాలెంజ్ను ముందుకు తీసుకెళ్లనుంది. గురువారం మొదలయ్యే పోటీల్లో ఇండియా బాక్సర్లకు మిశ్రమ డ్రా ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీ) తొలి రౌండ్లో అజర్ బైజాన్కు చెందిన అనఖనిమ్ ఇస్మాయిలోవాతో పోటీ పడనుంది. అయితే, తన టైటిల్ నిలబెట్టుకునేందుకు ఆమె బలమైన ప్రత్యర్థులను దాటాల్సి ఉంది. సెమీస్, ఫైనల్ దారిలో రియో ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ ఇంగ్రిట్ వాలెన్సియా (కొలంబియా), టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ సుకిమి నమికి (జపాన్)తో సవాల్ ఎదురవనుంది. 75 కేజీ కేటగిరీలో ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గొహైన్కు తొలి రౌండ్లో బై లభించింది. రెండో రౌండ్లో తను వనెసా ఒర్టిజ్ (మెక్సికో)తో తలపడుతుంది.
సెమీస్లో ఆమె టోక్యో సిల్వర్ మెడలిస్ట్ లి కియాన్ (చైనా)తో పోటీ పడే చాన్సుంది. 81 కేజీల్లో సవీటి బూర ఒక్క బౌట్ గెలిస్తే సెమీస్ చేరి మెడల్ ఖాయం చేసుకుంటుంది. తొలి రౌండ్లో బై దక్కించుకున్న ఆమె నేరుగా క్వార్టర్స్లో పోటీ పడుతుంది. జైస్మిన్ లంబోరియా (60 కేజీ), ప్రీతి (54 కేజీ)కి కూడా కఠిన డ్రాలు ఎదురయ్యాయి. నీతు ఘంఘాస్ (48 కేజీ), సాక్షి చౌదరి (52 కేజీ), మనీషా మౌన్ (57 కేజీ) తదితరులు మాత్రం సులభ డ్రాలో ఉన్నారు. నిఖత్తో పాటు సాక్షి, నుపూర్ (+81 కేజీ), ప్రీతి తొలి రోజు బౌట్లలో పోటీ పడతారు. మరోవైపు బుధవారం టోర్నీ ఓపెనింగ్ సెర్మనీ అట్టహాసంగా సాగింది. సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్, ఐబీఏ, బీఎఫ్ఏ ప్రెసిడెంట్లు క్రెమ్లెవ్, అజయ్ సింగ్తో పాటు టోర్నీ అంబాసిడర్, బాక్సింగ్ లెజెండ్ ఎంసీ మేరీకోమ్, బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్ హాజరయ్యారు. మార్చ్ఫాస్ట్లో లవ్లీనా బొర్గొహైన్ ఇండియా ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించింది. నిఖత్ జరీన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.
©️ VIL Media Pvt Ltd. 2023-03-16T03:27:00Z dg43tfdfdgfd