లైవ్‌ మ్యాచ్‌లో ఘోరం.. బ్యాటర్‌ కొట్టిన బంతి తగిలి, పావురం గిలగిలా కొట్టుకుని..!

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌ 2024, 2025లో అనుకోని ఘటన జరిగింది. లైవ్‌ మ్యాచ్‌ జరుగుతుండగా బ్యాటర్‌ వేగంగా కొట్టిన బంతి తగిలి మైదానంలో తిరుగుతున్న పావురం మృతి చెందింది! ఈ దృశ్యాలను కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. పావురానికి బంతి తగిలిన దృశ్యాలను చూసి క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్, కామెంటేటర్లు విచారం వ్యక్తం చేశారు.సాధారణంగా క్రికెట్‌లో బంతి వచ్చి తగలడం ద్వారా ఆటగాళ్లు గాయపడటం చూసి ఉంటాం. కొన్ని సార్లు స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులకు కూడా బంతి తగులుతుంది. బ్యాటర్లు కొట్టే షాట్లు.. మైదానంలోని అద్దాలను పగలగొట్టిన ఉదంతాలనూ చూశాం. కానీ బంతి తగిలి పావురం అల్లాడిపోవడంతో బిగ్ బాష్‌లీగ్‌లో కనిపించింది. బిగ్ బాష్ లీగ్‌ 2025లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా మెల్‌బోర్న్ స్టార్స్, సిడ్నీ సిక్సర్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ 32 బంతుల్లో 58 రన్స్ స్కోరు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్ ఆశించినంత వేగంగా పరుగులు రాబట్టలేకపోయింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 10 ఓవర్‌ను మెల్‌బోర్న్‌ బౌలర్ జోయెల్ ప్యారిస్ వేశాడు. స్ట్రైకింగ్‌లో జేమ్స్ విన్స్ ఉన్నాడు.ఈ ఓవర్‌లో ఐదో బంతిని విన్స్ బలంగా బౌండరీ దిశగా షాట్ కొట్టాడు. దీంతో బంతి వేగంగా బౌండరీ దిశగా దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో సీగిల్‌ జాతికి చెందిన పావురాలు.. పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పదుల సంఖ్యలో పావురాలు అక్కడే తచ్చాడుతూ కనిపించాయి. ఈ క్రమంలోనే జేమ్స్‌ విన్స్‌ కొట్టిన బంతి వెళ్లి నేరుగా పావురానికి తగిలింది. దీంతో అది గిలగిలా కొట్టుకుండి గ్రౌండ్‌లోనే పడిపోయింది. బంతి తగిలిన వేగానికి అది చనిపోయినట్లు సమాచారం. అనుకోకుండా జరిగిన ఈసంఘటనతో బ్యాటర్‌ విన్స్ సహా.. కామెంటేటర్స్, ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఆస్ట్రేలియాలోని పావురాలు డిసెంబర్ - జనవరి నెలలో గుంపులు గుంపులుగా ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తాయట. ఈ క్రమంలోనే పదుల సంఖ్యలో మెల్‌బోర్న్‌ స్టేడియంలో వచ్చాయట.

2025-01-10T17:36:19Z