పాకిస్థాన్‌కు కొత్త సమస్య.. భారత్ ప్రమేయం లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ తరలిపోయే ఛాన్స్

పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కి ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చిలో పాక్‌లో ఈ టోర్నీ నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం వంద రోజుల ముందే షెడ్యూల్‌ ప్రకటించాలి. కానీ, గడువు ముగిసినా ఇప్పటికీ షెడ్యూల్‌ మాత్రం విడుదల కాలేదు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు తాము పాకిస్థాన్‌ వెళ్లబోమని, హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహించాలని భారత్‌ చెప్పడం.. అందుకు ఆతిథ్య దేశం ఒప్పుకోకపోవడంతో టోర్నీ నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో పాకిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఈ టోర్నీ నిర్వహణ అంశాన్ని మరింత సందిగ్ధంలో పడేశాయి. టోర్నీ నిర్వహణ విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలని భావించిన ఐసీసీ.. శుక్రవారం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఆన్‌లైన్‌ ద్వారా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీబీ మరోసారి తన ఉద్దేశాన్ని ఐసీసీకి స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. తాము ఎట్టిపరిస్థితుల్లో హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోమని.. టోర్నీలో పాల్గొనే జట్లు కచ్చితంగా పాకిస్థాన్‌కు రావాల్సిందే అని పట్టుబడుతోంది. ఈ మేరకు తన నిర్ణయాన్ని ఐసీసీకి గురువారం వెల్లడించినట్లు సమాచారం. ఇదే సమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పలు ప్రశ్నలు కూడా లేవనెత్తినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు వచ్చేందుకు భారత్‌ నిరాకరించడంతో హైబ్రిడ్ మోడ‌ల్‌ను ఆమోదిస్తే.. ఇండియాకు ప్రిఫ‌రెన్స్ ఇచ్చిన‌ట్లే అవుతుంద‌ని పీసీబీ భావిస్తోంది. ఒక‌వేళ తమ డిమాండ్‌ను పట్టించుకోకుండా హైబ్రిడ్ మోడ‌ల్‌కు అవ‌కాశం ఇస్తే మాత్రం భవిష్యత్‌లో భారత్‌లో జరిగే ప్రతీ ఐసీసీ టోర్నీని కూడా హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించాల్సి ఉంటుందని పీసీబీ పట్టుబడుతోంది. తాము కూడా భారత గడ్డపై అడుగుపెట్టబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా పాకిస్థాన్‌లో ఆడకూడదనే అంశంపై భార‌త‌ ప్రభుత్వం బీసీసీఐకి లేఖ స‌మ‌ర్పించిందా అని కూడా పీసీబీ ఆరా తీసింది. ఈ నేపథ్యంలో రేపు జరిగే భేటీపై ఉత్కంఠ నెలకొంది.

మధ్యలోనే వెళ్లిపోయిన శ్రీలంక

హైబ్రిడ్‌ మోడల్‌కు పాక్‌ అంగీకరించకపోతే.. టోర్నీ మొత్తం వేరే దేశంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాక్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిలూ అందుకు కారణమయ్యేలా ఉన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పాకిస్థాన్‌లో గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో ఇటీవల 2 టెస్టులు, 3 వన్డేలు ఆడేందుకు పాక్‌కు వెళ్లిన శ్రీలంక-ఏ జట్టు అర్ధంతరంగా సిరీస్‌ను వదిలేసే స్వదేశానికి వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్‌లో కాకుండా దేశంలో టోర్నీని నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

2024-11-28T16:33:40Z