టీమిండియా విక్టరీ పరేడ్.. అందరి చూపు క్రికెటర్ల వైపు.. ఆటగాళ్ల ఫోకస్ మాత్రం ఇతడిపై..!

టీ20 వరల్డ్ కప్ గెలిచి భారత గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా క్రికెటర్లకు స్వదేశంలో అపూర్వ స్వాగతం లభించింది. బార్బడోస్ నుంచి ఎయిరిండియా ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న భారత క్రికెటర్లు.. ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేశారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని మోదీ నివాసానికి వెళ్లిన ఆటగాళ్లను ప్రధాని అభినందించారు. క్రికెటర్ల అనుభవాలను తెలుసుకున్న ప్రధాని మోదీ.. వారితో కలిసి కాసేపు సరదాగా గడిపాక ఫొటోలు దిగారు.

ప్రధానిని కలిసిన తర్వాత భారత క్రికెటర్లు ఛార్టర్డ్ విమానంలో ఢిల్లీ నుంచి ముంబైకి బయల్దేరి వెళ్లారు. ముంబైలో రోహిత్ సేనకు జీవితాంతం గుర్తుండిపోయే స్వాగతం లభించింది. ముంబై మెరైన్ రోడ్డులో అప్పటికే నిరీక్షిస్తోన్న లక్షలాది మంది అభిమానులకు అభివాదం చేస్తూ.. ఓపెన్ టాప్ బస్సులో ఆటగాళ్లు వాంఖడే మైదానానికి చేరుకున్నారు.

భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ముంబై రోడ్లు జనసంద్రమయ్యాయి. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పడరాని పాట్లు పడ్డారు. ఓ అభిమానైతే ఏకంగా ఓ చెట్టు పైకి ఎక్కి తన ఫోన్‌తో క్రికెటర్ల ఫొటోలు, వీడియోలు తీశాడు. వర్షాకాలంలో చెట్లు ఎక్కడం అంత తేలిక కాదు. అది కూడా చీకటిగా ఉన్న సమయంలో ఇంకా కష్టం. అయినా సరే సదరు అభిమాని.. అలవోకగా చెట్టెక్కి.. గ్రిప్‌ కోసం దాదాపుగా పడుకున్న భంగిమలో కొమ్మపై ఉండి భారత క్రికెటర్లను ఫోటోలు తీశాడు.

లక్షలాదిగా గుమికూడిన అభిమానులకు అభివాదం చేస్తూ.. ముందుకెళ్తున్న క్రికెటర్లు.. చీకట్లో సడెన్‌గా చెట్టు మీద ఏదో కదులుతుండటం చూసి ఒకింత భయపడ్డారు. కాస్త నిశితంగా పరిశీలించి చూశాక.. చెట్టు మీద ఉన్నది మనిషేనని గుర్తించాక ఊపిరి పీల్చుకొని సరదాగా నవ్వుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. క్రికెటర్లను చూడటం కోసం ఎంతో సాహసం చేసి చెట్టు ఎక్కిన ఆ అభిమాని.. కాసేపు క్రికెటర్లను భయపెట్టడంతోపాటు.. వారి దృష్టిని ఆకర్షించాడు.

క్రికెటర్లను దగ్గర్నుంచి చూసేందుకు చెట్టెక్కిన ఆ అభిమాని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఫొటో ఎడిటింగ్ చేసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చెట్టెక్కి ఫొటోలు తీస్తున్నట్టుగా కొందరు క్రియేట్ చేశారు. ఇంకా నయం ఆ చెట్టు కొమ్మను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నరికేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకొచెం ముందుకు పాక్కుంటూ వెళ్లి టీమిండియా ఆటగాళ్లున్న ఓపెన్ టాప్ బస్సులోకి దూకేసేవాడేమో.

క్రికెటర్లను సన్మానించిన మహారాష్ట్ర సీఎం:

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శుక్రవారం ముంబైకి చెందిన భారత క్రికెటర్లను సన్మానించారు. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సూర్యకుమార్ యాదవ్, జైశ్వాల్, శివమ్ దూబేలను సత్కరించిన ఆయన.. వారికి జ్ఞాపికగా వినాయకుడి ప్రతిమలను అందించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-05T11:33:17Z