జితేందర్‌రెడ్డి X మహేశ్‌ గౌడ్‌

  • టీవోఏలో వర్గపోరు
  • జితేందర్‌రెడ్డి ప్యానెల్‌కు ఐవోఏ షాక్‌

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్‌ సంఘం(టీవోఏ)లో కాంగ్రెస్‌ కుంపటి రాజుకుంది. ఈమధ్యే అధ్యక్షుడిగా ఎన్నికైన ఏపీ జితేందర్‌రెడ్డికి, ప్రస్తుత పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. గత నెలలో జరిగిన టీవోఏ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన జితేందర్‌రెడ్డి వర్గానికి భారత ఒలింపిక్‌ సంఘం(ఐవోఏ) దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. పలు న్యాయపరమైన చిక్కులు దాటి ఎన్నికైన కార్యవర్గానికి ఐవోఏ గుర్తింపు కూడా దక్కలేదు. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉత్తరాఖండ్‌లో 39వ జాతీయ క్రీడలు జరుగనున్నాయి. సాధారణంగా జాతీయ క్రీడలకు జట్లను ఎంపిక చేసే బాధ్యతను ఆయా రాష్ర్టాల ఒలింపిక్‌ సంఘాలకు ఐవోఏ అప్పగిస్తుంది. కానీ టీవోఏను గుర్తించని ఐవోఏ..ఈనెల 6న రాష్ట్ర క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు లేఖ రాసింది.

ఇందులో ప్రస్తుత సాట్స్‌ ఎండీ సోనీబాలదేవిని చెఫ్‌ డీ మిషన్‌గా ఎంపిక చేస్తున్నట్లు పీటీ ఉష తమ అధికారిక లేఖలో పేర్కొన్నారు. ఆమెకు తోడు టీవోఏ మాజీ కోశాధికారి మహేశ్వర్‌, ఆర్చరీ సంఘం కార్యదర్శి సంజీవరెడ్డిని డిప్యూటీలుగా నియమిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆయా జట్ల ఎంపిక బాధ్యతను టీవోఏ నుంచి తప్పిస్తున్నట్లయ్యింది. ఎన్నికల్లో ఐవోఏ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కడంతో టీవోఏకు గుర్తింపు దక్కకుండా పోయింది.

దీనికి తోడు ఎన్నికల్లో జిల్లా సంఘాలకు ఓటు హక్కు కల్పించడం, ఎలక్ట్రోరల్‌ కాలేజీ జాబితాలో తప్పులు ఉండటం, జాతీయ స్పోర్ట్స్‌కోడ్‌ను పాటించకపోవడం, ఐవోఏ పరిశీలకుడు లేకపోవడం వంటి కారణాలతో టీవోఏ గుర్తింపునకు నోచుకోకుండా పోయింది. దీనిపై మంగళవారం సమావేశమైన టీవోఏ ప్యానెల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ముగించింది. ఇదిలా ఉంటే అసోసియేషన్‌ రోజువారీ వ్యవహారాలు నిర్వహించేందుకు ఐవోఏ అడ్‌హక్‌ కమిటీ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2025-01-07T19:44:46Z