ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఆరోజే..! రోహిత్‌కు లాస్ట్ ఛాన్స్‌..?

మరో 40 రోజుల్లో పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు.. జట్ల ఎంపికపై దృష్టి సారించాయి. అందరికంటే ముందే.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించింది. ఇక భారత జట్టును ప్రకటించే విషయంపై బీసీసీఐ సమయాత్తం అవుతోంది. జట్టు కూర్పు, తుది జట్టు వంటి విషయాలపై బీసీసీఐ ప్రధానంగా దృష్టిసారించింది.ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా దారుణ ప్రదర్శన చేసింది. సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విఫలం కావడంతో సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. అయితే ఈ సిరీస్ తర్వాత వీరిద్దరూ టెస్టులకు గుడ్‌బై చెబుతారని అంతా భావించారు. రోహిత్ శర్మనేతై అంతర్జాతీయ క్రికెట్‌కే గుడ్‌బై చెబుతాడనే వార్తలు వచ్చాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుకు కొత్త కెప్టెన్‌కు ఎంపిక చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ రోహిత్ శర్మకు బీసీసీఐ మరో ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోంది!ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జనవరి 12 వరకు ఆయా దేశాలు తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. ఇందుకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక ఈ టోర్నీకి ముందు భారత జట్టు ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. మొత్తంగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఒకేసారి ఒకే జట్టును బీసీసీఐ ఎంపిక చేయాలని చూస్తోందని తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లనే ఛాంపియన్స్ ట్రోఫీకి కొనసాగించవచ్చని సమాచారం.ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ సారథ్యంలోనే భారత్‌ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇస్తారని భావించినా.. అతడిని కూడా వన్డే సిరీస్‌కు ఎంపిక చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2023లో విరాట్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో కోహ్లీపై సెలక్టర్లు విశ్వాసం ఉంచే అవకాశం ఉంది.మోకాలి వాపు కారణంగా ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమైన షమీ.. ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో అతడు కూడా భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. బుమ్రా వెన్నునొప్పిపై మెడికల్ రిపోర్టు రావాల్సి ఉంది. ఒకవేళ బుమ్రా కూడా ఫిట్‌నెస్‌ సాధించి వస్తే.. భారత బౌలింగ్‌ పటిష్టంగా మారనుంది.

2025-01-08T08:35:20Z