ఇదేందయ్యా బాబూ.. అభిమాని చేసిన పనికి జడుసుకున్న కోహ్లీ, రోహిత్..!

టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ సాధించిన అనంతరం ముంబైలో టీమిండియా విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ర్యాలీలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మెరైన్ డ్రైవ్‌ మీదుగా వాంఖడే స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఓపెన్ టాప్ బస్సుపై టీమిండియా ప్లేయర్లు అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. దీంతో సాగర తీరం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది. ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ తరలిరాగా.. ముంబై కిక్కిరిసిపోయింది.

ముంబై విక్టరీ పరేడ్‌లో భారత క్రికెటర్లను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో భారత క్రీడాకారులను దగ్గర నుంచి చూసేందుకు ఓ అభిమాని సాహసం చేశాడు. మెరైన్ డ్రైవ్ గుండా విజయోత్సవ ర్యాలీ కొనసాగుతుండగా.. సమీపంలోని చెట్టు ఎక్కి వారిని దగ్గరి నుంచి చూసే ప్రయత్నం చేశాడు. ఎంచక్కా చెట్టు కొమ్మపై పడుకుని.. సెల్‌ఫోన్‌తో టీమిండియా ప్లేయర్లను ఫొటో, వీడియోలు తీసుకున్నాడు. అయితే ఒక్కసారిగా చెట్టుపై సదరు అభిమానిని చూసిన టీమిండియా క్రికెటర్లు బెదిరిపోయారు.

ఇదేం అభిమానంరా అయ్యా.. ఒక్కసారి నిన్ను చూసి జడుసుకున్నాం కదా అన్నట్లు లుక్ ఇచ్చారు. సదరు అభిమాని చెట్టుపైకి ఎక్కి ఫొటోలు తీసిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. బ్రో.. జారి కింద పడితే సెలబ్రేషన్స్ కాస్తా.. విషాదంగా మారేవి అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. టీమిండియా ప్లేయర్లను దగ్గర్నుంచి చూసే అవకాశం వచ్చింది అదృష్టవంతుడు అని పేర్కొంటున్నారు.

ఇక అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ విజయం పట్ల దేశవ్యాప్తంగా సంబురాలు జరిగాయి. హరికేన్ కారణంగా భారత క్రికెట్ జట్టు ఫైనల్ తర్వాత వెస్టిండీస్‌లోనే చిక్కుకుపోయింది. చివరకు రెండు రోజుల తర్వాత బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరింది. గురువారం ఉదయం 11 గంటలకు పీఎం మోదీతో టీమండియా ఆటగాళ్లు భేటీ అయ్యారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ముంబైలో విజయోత్సవ పరేడ్ నిర్వహించాలని భావించారు.

కానీ అనుకున్నదానికంటే రెండు గంటలు ఆలస్యంగా ర్యాలీ ప్రారంభమైంది. సుమారు రెండు గంటల పాటు ఈ ప్రదర్శన కొనసాగింది. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో బీసీసీఐ భారత ఆటగాళ్లను సన్మానించింది. ముందుా ప్రకటించిన రూ.125 కోట్లను ఆటగాళ్లకు అందించింది. అనంతరం ప్లేయర్లంతా గ్రౌండ్‌లో తిరిగి.. ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. వందే మాతరం, చక్ దే ఇండియా అంటూ స్వరం కలిపి హోరెత్తించారు. దీంతో టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజయోత్సవ ర్యాలీ ముగిసింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-05T06:02:21Z